నా చిన్నతనంలో పంచతంత్ర కథల్లో, స్థానబలం గురించి ఒక కథ చదివిన గుర్తు. అందులో ఎవరైనా తమతమ నెలవుల్లో ఉంటేనే వారికి బలముంటుందనీ, ఒకరి నెలవులో ఇంకొకరు ఉంటే అంత బలముండదని ఆ కథ సారాంశం. దీనినే కొంచం వేరేగా చెప్తే, ఎవరుండాల్సిన చోట వారుండటమే అందరికీ శ్రేయస్కరం అని అనొచ్చేమో??? ఇంతకీ నా సొద ఏమిటంటే, మొన్నీమధ్య హైదరాబాదులో జరిగిన ప్రజారాజ్యం పార్టీ మీటింగులోనూ, మిగతా పార్టీల మీటింగుల్లోనూ, ఎక్కడ చూసినా, పాలిటిక్సులోకి దూకిన సినీరంగప్రముఖులు కనిపిస్తున్నారు. సినిమాతెరలపైన తళుక్కుమనే తారలిప్పుడు వివిధ పార్టీల ప్రచారసభల్లో దర్శనమిస్తున్నారు. మా ఊళ్ళో, ఒకప్పుడు ఎన్నికలంటే, నేతలు ప్రజలని ఆకర్షించటానికి పార్టీ మీటింగ్లలో పెద్దపెద్ద సినిమా ఆర్టిస్టుల డూపులను, లేదా వారిని అనుకరించే మిమిక్రీ ఆర్టిస్టులనూ తీసుకొచ్చి ప్రచారం చేయించేవారు, ఎన్.టీ.ఆర్, నాగేశ్వర రావు, కృష్ణ, రాజబాబు, రేలంగి లాంటి వాళ్ళని బాగా అనుకరించి ప్రజల్ని మెప్పించేవాళ్ళు. కాని ఇప్పటి రాజకీయ పరిస్తితుల్లో అది సాధ్యం కాదేమో, ఐనా ఇంకా ఇలాంటి సభలకి డిమాండు ఉన్న మిమిక్రీ ఆర్టిస్టులకి మాత్రం ఇది పెద్ద పరీక్షే. ఒకసారి ఆలోచించండి, కాంగ్రెస్ పార్టీ సభల్లో, చిరంజీవినో, బాలకృష్ణనో, ఎన్.టీ.ఆర్ నో, ఆయన మనవడు జూ. ఎన్.టీ.ఆర్ నో అనుకరించకూడదు, ఎందుకంటే ఆ హీరోలు కాంగ్రెస్కి ప్రతిపక్ష పార్టీలుగా ఉన్న తెలుగుదేశం, ప్రాజారాజ్యం పార్టీలలో నేతాలాయే, అలానే మిగతా పార్టీల సంగతీ అంతే…. ఒకవైపు చిరంజీవి కొత్తగా పార్టీ పెట్టి తనకున్న ఫ్యాను ఫాలోయింగుతో నెగ్గుతాను అనే ధీమాతో ఉన్నారు, ఆయన తమ్ముడు పవన్ కల్యాణ్ కూడా అన్నగార్ని బాగా ఉత్సాహపరుస్తూ ప్రచారాలలో పాల్గొంటున్నాడు. అటువైపు తెలుగువారందరికీ “అన్న”గా పేరు తెచ్చుకున్న కీ.శే, నందమూరి తారక రామారావు గారు స్థాపించిన తెలుగుదేశంలో ఆయన కొడుకులు బాలకృష్ణ, హరికృష్ణలు ఎన్నికల బరిలోకి దూకిన సంగతి అందరికీ విధితమే, ఇప్పుడు కొత్తగా ఎన్నికల్లో కుర్రతనాన్ని నింపటానికి అన్నట్లు, రామారావుగారి మనవడూ, హరికృష్ణ పుత్రుడూ ఐన జూ. ఎన్.టీ.ఆర్, కూడా రేయనకా పగలనకా, ఎండనకా, వాననకా తెలుగుదేశం పార్టీ తరపున ఊరూరూ తిరుగుతూ ప్రచారం చేస్తున్నాడు. అతని మాటతీరు ఏదో అనుభవమున్న ప్రచారకుడిలా స్పష్టంగా, నిబ్బరంగా ఉందని ఈ మధ్యే కొన్ని ప్రధాన వార్తాపత్రికలు కూడా ప్రచురించాయి. ఈ తళుక్కలను తట్టుకోలేకో, మహిళా సెంటిమెంటు కోసమో, లేటెస్టుగా కాంగ్రెస్ పార్టీ సినీనటి జయసుధకి పార్టీ టికెట్టు ఇచ్చింది, ఆ మధ్యకాలంలో “ఆనంద్” సినిమా ఫేం రాజా కూడా ఆ పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు. మీడియాలను ప్రచారసాధనాలుగా వాడుకునే రాజకీయ పార్టీలు, ఇప్పుడు సినిమావాళ్ళనే ప్రచారానికి వాడుకోవటం వారి ముందడుగో మరి లేక ఇంకో వ్యూహరచనో, వారికే తెలియాలి. ఇంతకీ నేను మొదట్లో అన్నట్లు (లేదా పంచతంత్రంలో ప్రస్తావించినట్లూ) స్థానబలం ప్రతిసారి అవసరముండకపోవచ్చని, "అన్న" ఎన్.టీ.ఆర్, ఎప్పుడో నిరూపించారు, ఆయన నెలవు చలనచిత్ర రంగమనీ, రాజకీయం ఆయన స్థలం కాదని అనుకునే అప్పటి నేతల నోళ్ళు మూయించారు, మన తెలుగులోనే ఒకప్పుడు అగ్ర నాయికగా పేరొందిన జయప్రద కూడ ఉత్తరభారత దేశంలో, పరభాషా ప్రాంతప్రజలను మెప్పించి ప్రజాసేవకి, రాజకీయమైనా, చలనచిత్ర రంగమైనా ఒకటేనని చాటారు.ఈ వరుసలో మోహను బాబునీ, విజయశాంతి నీ, కృష్ణం రాజునీ, దాసరినీ, బాబూమోహన్ నీ, మర్చిపోతే ఆ సెలబ్రిటీలు, లెజెండరీలు ఫీలవుతారు. ఇంతకీ మన కుర్రకారూ, మన పెద్దవారూ, తమ సినిమా అబిమానాలకి పెద్దపీట వేస్తారో, లేక దేశాభివృధ్ధికి అగ్రపూజ్యమిచ్చి పనిమంతులైన నేతలని గెలిపిస్తారో చూడాలి, ఇదే విషయం వెరైటీగా సినీభాషలో చెప్పాలంటే, ఇప్పటి ఎన్నికల గ్లామరు రంగంలో ఏ పార్టీ హిట్టవుతుందో, ఏ పార్టీ నిర్మాతలకి (నేతలకు) బాక్సాఫీసులు బద్దలవుతాయో వేచి చూడాల్సిందే….
ఇట్లు భవదీయుడు
దారినపోయే దానయ్య
Showing posts with label glamor. Show all posts
Showing posts with label glamor. Show all posts
Tuesday, March 24, 2009
Subscribe to:
Posts (Atom)