Showing posts with label replacing ysr. Show all posts
Showing posts with label replacing ysr. Show all posts

Monday, September 7, 2009

పదవి ఎవరికి చేదు?

రాష్ట్ర రాజకీయరంగం ప్రస్తుతం ఓ రణరంగాన్ని తలపిస్తోంది. ఒక వైపు వైయస్స్ తనయుడు జగన్ ను సీయం చేయాలని రాష్ట్రవ్యాప్తంగా నిరాహారదీక్షలు, ఆత్మహత్యలు(?), సినిమా నటీనటులతో ప్రచారాలూ జరుగుతున్నాయి మరోవైపు హస్తినలో అధిష్టానం సీయల్పీ నేతను ఎన్నుకోవటానికి మల్లగుల్లాలు పడుతోంది.

రెండ్రోజులుగా ఎ ఐ సీ సీ లో సాగుతున్న చదరంగంలో పావులు చాలా వేగంగా, కీలకంగా, ఆసక్తిగా కదులుతున్నాయి. మొదట్నుండీ పరిగణలో ఉన్న జగన్, రోశయ్యలు అధిష్టానినిదే తుది నిర్ణయం అని మీడియాతో అన్న మాటల్లో వారికి అధిష్టానం పై ఎంత విశ్వాసం ఉందొ కరెక్టుగా చెప్పటం కొంచం కష్టమే.

ఈ సంధర్భంలో “మిమ్మల్నే పదవి కొన్సాగించమని అధిష్టానం అడిగితే మీరేమంటారు” అని ప్రశ్నించగా ముఖ్యమంత్రి రోశయ్యగారు “మాది ఒక చిన్న పార్టీ కాదు ఒక జాతీయ పార్టీ, మాకంటూ కొన్ని నియమాలూ, పద్దతులు ఉన్నాయి, అధిష్టానానిదే తుదినిర్ణయం అనీ, ఒకవేళ అధిష్టానం బావిలో దూకమన్నా, సముద్రంలో దుకమన్నా తాను దూకుతాననీ, మొదట్నుండీ తాను చేస్తున్నది అదేననీ, పార్టీకి నేనెల్లప్పుడూ విధేయుడినేనని” చెప్పటం పై ఆయనలో ముఖ్యమంత్రి అభ్యర్ధిత్వం పై ఆశ ఉన్నట్టు అనిపిస్తుంది.

ఇక తర్వాత కొంచం ఆలస్యంగా తెరపైకి ఎక్కిన మరికొందరు నేతల పేర్లు, జేసీ, జైపాల్ రెడ్డీ, డీయస్స్. మొదట్నుండీ డీయస్స్ రాష్ట్ర కాంగ్రెస్లో ఓ కృయాశీల పాత్ర పోషిస్తూ వచ్చారు కానీ మధ్యలో కొన్ని విబేధాల కారణంగా దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డిగారికీ ఆయనకూ ఉన్న సంబంధం చెడిందని మీడియాలో వార్తలు గుప్పుమన్నాయి, దానికి ఊటంకిస్తూ మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో డీయస్స్ ఓటమి చర్చనీయానంశమయ్యింది, అదే విధంగా జేసీ దివాకర్ రెడ్డికీ వైయస్స్ కీ బేధాభిప్రాయాలు వచ్చాయనీ, దాని కారణంగానే ఆయనకి రాష్ట్ర మంత్రిమండళిలో స్థానం లభించలేదనీ భోగట్టా, ప్రస్తుత రాజకీయ పరిస్తితుల్లో జేసీ, జగన్ అభ్యర్ధిత్వంపై సరిగ్గా స్పందించకపోవటంతో, ఆయనకూడా రేసులో ఉండాలనుకుంటున్నారనీ వార్తలొచ్చాయి. ఒకప్పుడు చాలా పలుకుబడి ఉన్న నేతగా పేరున్న జేసీ ప్రస్తుతం ఒంటరివారయ్యారు, ఆయన్ని కాంగ్రెస్స్ ఎమ్మెల్యేలెవరూ పట్టించుకోకుండా ఉన్నారు, మొదట్లో “జగన్ పై మీ ఉద్దేశ్యమేమిటంటూ" ప్రశ్నించగా “పార్టీశ్రేణుల్లో ఎవరూ నన్ను ఈ విషయం పై సంప్రదించలేదని” సమాధానమివ్వటం పరోక్షంగా జగన్ ని తాను సమర్ధించట్లేదని ప్రకటించంట్లయ్యింది, మళ్ళీ ఏమనుకున్నారో ఈరోజు ఆయనే స్వయంగా సోనియా గారికి జగన్ కి మద్దతు తెలుపుతూ లేఖ రాసారట, మరి ఇది దిగజారుతున్న తన పరిస్తితిని మెరుగు పరుచుకోటానికో లేక హటాత్తుగా జగన్ పై పుట్టుకొచ్చిన మమకారమో ఆయనకే తెలియాలి.

ఇవాల్టి వార్తల్లో మరిన్ని పేర్లు తెరంగేట్రం చేసి ఆసక్తిని రేకెత్తించాయి, అవి రాష్ట్ర ముఖ్యసలహాదారు, స్వర్గీయ వైయస్స్ కి ఆప్తమిత్రుడు అయిన కేవీపీ, ప్రస్తుత హోం మినిష్టర్ సబితా ఇందిరారెడ్డి, మాజీ ముఖ్యమంత్రీ, తెలుగుదేశం పార్టేఎ వ్యవస్థాపకుడూ, ఆంధ్ర ప్రజానీకం “అన్నగారు” అని సంబోధించే స్వర్గీయ ఎన్.టీ.ఆర్ గారి కుమార్తే అయిన దగ్గుబాటి పురందరేశ్వరి పేర్లు.ఈ పరిణామం దేశంలో సాగుతున్న మహిళా అధికార ధ్రోణి ప్రభావమేమోననే ఊహాగానాలకి తావిస్తోంది, మహిళా రాష్ట్రపతి, హస్తినకి మహిళా ముఖ్యమంత్రి, ఆంధ్రాలో ఓ మహిళ చేత అత్యంత కీలకమైన గృహమంత్రిత్వ శాఖని అధిరోహింపచేయటం, ఈ విషయాలన్నీ మహిళలకి రాజకీయాల్లో సాధికారత సంపాదించిపెడుతున్నాయని అందరు భావించారు, ఆనందపడ్డారు. ఈ కారణంగానే మన రాష్ట్రానికి ఓ మహిళని ముఖ్యమంత్రిగా చేయాలని అధిష్టానం భావించి ఉండొచ్చు, యూపీయే చైర్ పర్సన్ సోనియా గాంధీ కూడా ఓ మహిళే కావటం మరో ప్రధానాంశం.

మీడియాలో ఎన్ని ఊహాగానాలొస్తున్నా ఏ ఒక్క అభ్యర్ధైనా "లేదు నాకు ఆ పదవి వద్దు" అని ప్రకటించారేమో చూడండి, ఐనా పదవెవరికి చేదు చెప్పండి, అందరూ అధిష్టాన నిర్ణయమే శిరోధార్యమనే మంత్రాన్ని జపిస్తూ లౌక్యంగా తప్పించుకుంటున్నారు నిజమే, ఈ పరిస్థితి లో ఎవరైనా బహిరంగంగా నేను బరిలో ఉన్నాను అని చెప్పే సాహసం చేయగలరా? అసలే సానుబూతి ముసుగులో జగన్ కి పట్టం కట్టేందుకు చాలా ఆందోళనలు చేస్తున్నారు, చేయిస్తున్నారు కాంగ్రెస్ కార్యకర్తలూ, నేతలూ, ఎమెల్యేలు, మరిలా ఉండగా "నాకేగనక సీయం చాన్సు ఇస్తే" అని ఎవరినైనా వ్యాసం రాయమంటే ఎం రాస్తారు చెప్పండి. అనధికార సమాచారం ప్రకారం ఎనభై శాతం అవకాశం జగన్ కేనని గాలి. ఏదేమైనా ఈ నాటకానికి మరో మూడు రోజుల్లో తెరపడనుందని హస్తిన నుండి వర్తమానం, అంతవరకు వేచిచూడాల్సిందే. అంతవరకు ఈ పదవి కుమ్ములాట ఎవరికీ చేటు కాకుండా ఉంటె అంతే చాలు.

(మొదట్లో ఆత్మహత్యలు అనే పదం పక్కన ప్రశ్నార్ధకం పెట్టటానికి గల కారణం, నాకు ఆ విషయం అర్ధంకాకపోవటమే, నిరాహార దీక్షలు చేస్తున్నారంటె సరే, గొడవచేస్తున్నారంటె సరే, ఆత్మహత్య చేసుకుంటానని బెదిరిస్తున్నారన్నా సరే, కానీ నిజంగా ఆత్మహత్య చేసేసుకుంటె ఎం లాభం అంటే అందరూ ఆత్మహత్య చేసుకున్నారనుకోండీ ఇక ఆ ఫలానా వ్యక్తి సీయం అయ్యి ఏం ఉపయోగం?)

భవధీయుడు
దారినపోయే దానయ్య