Showing posts with label ysr. Show all posts
Showing posts with label ysr. Show all posts

Saturday, September 5, 2009

పదవి ఆస్తా? బాధ్యతా?

మన దివంగత ముఖ్యమంత్రికి కొందరు నివాళులర్పించే విధానాన్ని చూస్తే ఆవేదన కలుగుతోంది. ఒక ప్రజనాయకుడికి ఇదేనా మనమిచ్చే గౌరవం? ప్రజలకి ఒక గొప్ప బాసటగా నిలిచిన శ్రీ వై.యస్స్.ఆర్ గారిని ఖననం చేస్తున్నప్పుడు రోదనలకంటే, వివిధ మతాలవారు ఆయన ఆత్మశాంతికై చేస్తున్న ప్రార్థనలకంటే పెద్దగా జయజయ నాదాలు వినపడ్డాయి. వై.యస్స్.ఆర్ గారి తనయుడు జగన్ని ముఖ్యమంత్రిగా చూడాలి అని అనుకోవటం సబబే కానీ దానికి ఇదా సందర్భం? ఇదా సమయం? “వై. యస్స్ .ఆర్ అమర్ రహే” కి బదులుగా “కాబోయే సీయం జగన్” అని నినదించిన ఆ కార్యకర్తలకి, నేతలకి, అసలు గతించిన మనిషిపైన ఏమాత్రం గౌరవముందో అర్ధమవుతుంది. తండ్రి పోయిన దుఃఖంలో ఉన్న తనయుడిని ఓదార్చే తీరిదేనా? మనుషులయ్యుండి ఇంత విచక్షణలేకుండా ఎలా ప్రవర్తించగలుగుతున్నారు? స్వర్గస్తులయ్యింది మనం రాజ్యాంగబద్ధంగా ఎంచుకున్న నాయకుడు ఆయన మరణాన్ని ఇంకొకరికి పట్టం కట్టే సంధర్భంగా అభివర్నించటం కడు సోచనీయం.

ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా శ్రీ రోశయ్యగారిని ప్రభుత్వం ప్రకటించింది మరి కొన్ని రోజుల్లో మళ్ళీ అధిష్టానం ముఖ్యమంత్రి పదవి పై ఒక నిర్ణయానికి వస్తుంది, అప్పుడు కదా మన మద్దత్తు ఎవరికన్నది తెలపాల్సింది?

వార్తాపత్రికల్లో జగన్ సీయం కావాలని శిరోముండనం చేసుకున్న అభిమానులు, పిల్లలు అని ఫోటోలు ప్రచురించారు. వారిలో సగానికి పైగా ఉన్నది నాలుగేళ్ళనుండి పదమూడేళ్ళ మధ్యలో ఉన్న పిల్లలే, నిజంగా వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి ఉంటారా? ఆలోచించండి అసలు సీయం అంటే ఏమిటో కూడా సరిగ్గా తెలియని వయసు వారిది ఎవరో కార్యకర్తల ప్రోద్బలంతో జరిగే ఇలాంటి పొలిటికల్ డ్రామాలని అభిమానం అని ఎలా అనుకుంటారో అర్ధంకావట్లేదు. మన రాజ్యాంగంలో ఓటు హక్కు పద్దెనిమిదేళ్ళు పైబడ్డ యువతీయువకులకివ్వటం ఇలాంటి ప్రలోభాలని, బలవంతాలని అడ్డుకోవటానికే కదా.

పూర్వం రాజులహయాంలో సక్షత్రియులు మాత్రమే రాజ్యమేలేవారు (క్షత్రియుడంటే అదో వర్గమో, కులమో కాదు), వారి తదనంతరం రాజ్యాన్ని వారి వారసులకి అందించటం సాంప్రదాయం అది కూడా వారికి సరైన శిక్షణనిచ్చి, పలురకాల పరీక్షలు పెట్టి, బుధ్ధి, తెలివి, రాజనీతి, యుద్ధవిద్యాదులలో ప్రావీణ్యం ఉన్నప్పుడే రాజ్యాధికారాన్ని అప్పజెప్పేవారు, మన ఆస్తిని మన పిల్లలకి పంచివ్వటం సరైనదే కావచ్చు కానీ ఆ క్రమంలోనే, పరాయిదేశస్తులకి కొమ్ముకాచి చివరికి వారికి బానిసలుగా దశాబ్దాలపాటు వెట్టిచాకిరి చేసి దేశాన్నీ, దేశ సంపదలనీ అమూల్యమైన మన జాతి ఔన్నత్యాన్ని, ఆత్మాభిమాన్నాన్ని కోల్పోయాం, మళ్ళీ ఎన్నో రక్తతర్పణలతో స్వతంత్రులుగా అయ్యాం, ఎవరో కొందరు రాజులు భయంవల్లనో, మొహమాటం వల్లనో, పేరాశ వల్లనో, అమాయకత్వం వల్లనో, నిస్సహాయత వల్లనో, లేక పిరికితనం వల్లనో చేసిన పనికి సస్యశ్యామలము, సకలవిద్యా ధామము, సుసంపన్నము ఐన మనజాతి బిడ్డలు తెల్లవరి మోజేతి నీళ్ళు తాగాల్సిన అగత్యం పట్టింది. ఇలాంటిది మళ్ళీ జరగకూడదని ప్రజలనీ, వారి బాగోగులని చూసే బాధ్యతగలిగిన పదవులని సైతం ఆస్తులుగా పరిగణించటం సరికాదనే ఉద్దేశ్యంతో, రాజ్యాలనీ, రాజులనీ కాదని ప్రజలందరిని ఒక నీడకిందకి తీసుకొచ్చి రాజ్యాంగాన్నీ, రాజకీయాన్నీ ప్రవేశపెట్టుకున్నాం. మరి అలాంటప్పుడు ఇంకా ఈ వారసత్వ పరిపాలనలెందుకు? సానుభూతిని ప్రదర్శించటానికి ఇదొక్కటే పద్ధతా?

ప్రభుత్వకార్యాలయాల్లో ఎవరైన చనిపోతే వారి పదవులని వారి వారసులకి అందించే వీలుంది. మంత్ర పదవి కూడా ప్రభుత్వోద్యోగమే కానీ దానిని కూడా మిగతా వాటితో సరికట్టటం ఎంతవరకు న్యాయం? చిన్న ఉద్యోగాలలో అవకతవకలని సరిచేసుకునే వీలు ఉండొచ్చు, వీలుకాని పరిస్తితిలో అయినా ఆ నష్టం తక్కువగానే ఉంటుంది, అదే ఒక బాధ్యతగల మంత్రి పదవిని అనుభవంలేని వారికి ఇస్తే ఎదైనా తప్పు జరిగితే దాని నష్టం ఎంత పెద్దగా ఉంటుందో ఆలోచించాలి. మన దేశ చరిత్రలో ఎందరో వారసులు మంత్రి పదవులు చేపట్టారు, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, సబితా ఇందిరా రెడ్డి, దగ్గుబాటి పురందరేశ్వరి, తదితరులెందరో మనకి ఉదాహరణగా ఉన్నారు, వారంతా సమర్ధవంతంగా వారి పదవులని చేపట్టలేదా అని అడగొచ్చు, ఇదే సరైనదైతే ప్రతి ఐదు సంవత్సరాలకొకసారి ఎన్నికలెందుకు? వారి కుంటుంబాలే ఆ పదవుల్లో స్థిరపడిపోవచ్చు కదా? అప్పుడు ఎన్నికల తంతు ఉండదు ప్రతి ఐదేళ్ళకోసారి మనకి ఓటు హక్కు ఉంది అని మనం గుర్తుచేసుకోనక్కర్లేదు, డబ్బు, మందు, గట్రాలను పంచక్కర్లేదు, ఓటు వినియోగించుకోటానికి గంటలతరబడి క్యూలో నిలబడక్కర్లేదు తొక్కిసలాటలు తన్నులాటలు జరగక్కర్లేదు. కానీ మనం ఎన్నికలని నిర్వహిస్తాం, రాజ్యాంగ బధ్ధంగా నాయకులని ఎన్నుకుంటాం ఎందుకని? నాయకుల పని తీరుని గమనించటానికి, నాయకుల అవకతవకలని ఎత్తుచూపటానికి మనదగ్గరున్న ఓటు అనే ఆయుధాన్ని వాడుకోవటం ఎంతో అవసరం కాబట్టి, ఆ ఆయుధమే లేకుంటే మళ్ళీ బానిసత్వశృంఖలాల్లోకి తల్లి భారతిని ఎప్పుడొ నెట్టేసి మరణశిక్ష విధించగలవారున్నారు, దేశాన్ని వేలానికి అమ్మగలిగేంతా మహానాయకులూ ఉన్నారు.

కుటుంబం గొప్పదని చూసి పిల్లలచేతికి అణ్వాస్త్రాన్ని ఇవ్వలేము కదా, ఏం చేస్తారో చూద్దాంలే అని మన భవిష్యత్తును వారిచేతికిచ్చి చూస్తూ కూర్చోలేం కదా, దేశం ప్రయోగశాల కాదు మనమందరం ప్రయోగశాలలోని వస్తువులము కాదు, సానుభూతితో చేసే ప్రయోగం వికటిస్తే ఇప్పుడిప్పుడే గుర్తింపు పొందుతున్న మన దేశం గుర్తేలేకుండా పోయే ప్రమాదం ఉంది. మన దేశాన్ని మనమే కాపాడుకుందాం మన తలరాతలని మనమే దిద్దుకుందాం. రాజ్యాంగపరంగా, చట్టపరంగా, న్యాయపరంగా జీవిద్దాం, నాయకులను సానుభూతితో కాక స్పూర్థితో ఎన్నుకుందాం దేశాన్ని ప్రగతిపథాన నడిపిద్దాం.

ఇదేదో ఒకరిపైన కోపంతోనో, వ్యతిరేకతతోనో వ్రాసింది కాదు, ఒక భారతీయ పౌరుడిగా దేశం పట్ల ఉన్న మమకారమే నా మనసునిలా స్పందింపజేసిందే తప్ప మరొకటి కాదు.ఒకసారి ఆలోచించండి ఎవరి మనోభావాలనైనా నొప్పిస్తే మన్నించండి.

మరోసారి మన చిరునవ్వుల ముఖ్యమంత్రి, రాజకీయానికి సొగసుతెచ్చిన మొనగాడు, మడమతిరగని ధీరుడు శ్రీ యేడుగూరి సందింటి రాజశేఖర రెడ్డి గారికి నివాళులర్పిస్తూ, వారి ఆత్మకి శాంతి ప్రసాదించాలనీ, వారి కుటుంబానికి మనోస్థైర్యాన్ని, గుండెనిబ్బరాన్ని ప్రసాదించమని ఆ భగవంతున్ని ప్రార్ధిస్తూ..

భవదీయుడు
దారినపోయే దానయ్య



Wednesday, September 2, 2009


Dr. Yeduguri Sandinti Rajasekhara Reddy
8th Jul 1949 - 3rd Sep 2009

It is a great tragedy to have lost our Chief minister in a chopper crash. Lets pray for his soul and pray for strength to handle this situation.