Monday, September 7, 2009

పదవి ఎవరికి చేదు?

రాష్ట్ర రాజకీయరంగం ప్రస్తుతం ఓ రణరంగాన్ని తలపిస్తోంది. ఒక వైపు వైయస్స్ తనయుడు జగన్ ను సీయం చేయాలని రాష్ట్రవ్యాప్తంగా నిరాహారదీక్షలు, ఆత్మహత్యలు(?), సినిమా నటీనటులతో ప్రచారాలూ జరుగుతున్నాయి మరోవైపు హస్తినలో అధిష్టానం సీయల్పీ నేతను ఎన్నుకోవటానికి మల్లగుల్లాలు పడుతోంది.

రెండ్రోజులుగా ఎ ఐ సీ సీ లో సాగుతున్న చదరంగంలో పావులు చాలా వేగంగా, కీలకంగా, ఆసక్తిగా కదులుతున్నాయి. మొదట్నుండీ పరిగణలో ఉన్న జగన్, రోశయ్యలు అధిష్టానినిదే తుది నిర్ణయం అని మీడియాతో అన్న మాటల్లో వారికి అధిష్టానం పై ఎంత విశ్వాసం ఉందొ కరెక్టుగా చెప్పటం కొంచం కష్టమే.

ఈ సంధర్భంలో “మిమ్మల్నే పదవి కొన్సాగించమని అధిష్టానం అడిగితే మీరేమంటారు” అని ప్రశ్నించగా ముఖ్యమంత్రి రోశయ్యగారు “మాది ఒక చిన్న పార్టీ కాదు ఒక జాతీయ పార్టీ, మాకంటూ కొన్ని నియమాలూ, పద్దతులు ఉన్నాయి, అధిష్టానానిదే తుదినిర్ణయం అనీ, ఒకవేళ అధిష్టానం బావిలో దూకమన్నా, సముద్రంలో దుకమన్నా తాను దూకుతాననీ, మొదట్నుండీ తాను చేస్తున్నది అదేననీ, పార్టీకి నేనెల్లప్పుడూ విధేయుడినేనని” చెప్పటం పై ఆయనలో ముఖ్యమంత్రి అభ్యర్ధిత్వం పై ఆశ ఉన్నట్టు అనిపిస్తుంది.

ఇక తర్వాత కొంచం ఆలస్యంగా తెరపైకి ఎక్కిన మరికొందరు నేతల పేర్లు, జేసీ, జైపాల్ రెడ్డీ, డీయస్స్. మొదట్నుండీ డీయస్స్ రాష్ట్ర కాంగ్రెస్లో ఓ కృయాశీల పాత్ర పోషిస్తూ వచ్చారు కానీ మధ్యలో కొన్ని విబేధాల కారణంగా దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డిగారికీ ఆయనకూ ఉన్న సంబంధం చెడిందని మీడియాలో వార్తలు గుప్పుమన్నాయి, దానికి ఊటంకిస్తూ మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో డీయస్స్ ఓటమి చర్చనీయానంశమయ్యింది, అదే విధంగా జేసీ దివాకర్ రెడ్డికీ వైయస్స్ కీ బేధాభిప్రాయాలు వచ్చాయనీ, దాని కారణంగానే ఆయనకి రాష్ట్ర మంత్రిమండళిలో స్థానం లభించలేదనీ భోగట్టా, ప్రస్తుత రాజకీయ పరిస్తితుల్లో జేసీ, జగన్ అభ్యర్ధిత్వంపై సరిగ్గా స్పందించకపోవటంతో, ఆయనకూడా రేసులో ఉండాలనుకుంటున్నారనీ వార్తలొచ్చాయి. ఒకప్పుడు చాలా పలుకుబడి ఉన్న నేతగా పేరున్న జేసీ ప్రస్తుతం ఒంటరివారయ్యారు, ఆయన్ని కాంగ్రెస్స్ ఎమ్మెల్యేలెవరూ పట్టించుకోకుండా ఉన్నారు, మొదట్లో “జగన్ పై మీ ఉద్దేశ్యమేమిటంటూ" ప్రశ్నించగా “పార్టీశ్రేణుల్లో ఎవరూ నన్ను ఈ విషయం పై సంప్రదించలేదని” సమాధానమివ్వటం పరోక్షంగా జగన్ ని తాను సమర్ధించట్లేదని ప్రకటించంట్లయ్యింది, మళ్ళీ ఏమనుకున్నారో ఈరోజు ఆయనే స్వయంగా సోనియా గారికి జగన్ కి మద్దతు తెలుపుతూ లేఖ రాసారట, మరి ఇది దిగజారుతున్న తన పరిస్తితిని మెరుగు పరుచుకోటానికో లేక హటాత్తుగా జగన్ పై పుట్టుకొచ్చిన మమకారమో ఆయనకే తెలియాలి.

ఇవాల్టి వార్తల్లో మరిన్ని పేర్లు తెరంగేట్రం చేసి ఆసక్తిని రేకెత్తించాయి, అవి రాష్ట్ర ముఖ్యసలహాదారు, స్వర్గీయ వైయస్స్ కి ఆప్తమిత్రుడు అయిన కేవీపీ, ప్రస్తుత హోం మినిష్టర్ సబితా ఇందిరారెడ్డి, మాజీ ముఖ్యమంత్రీ, తెలుగుదేశం పార్టేఎ వ్యవస్థాపకుడూ, ఆంధ్ర ప్రజానీకం “అన్నగారు” అని సంబోధించే స్వర్గీయ ఎన్.టీ.ఆర్ గారి కుమార్తే అయిన దగ్గుబాటి పురందరేశ్వరి పేర్లు.ఈ పరిణామం దేశంలో సాగుతున్న మహిళా అధికార ధ్రోణి ప్రభావమేమోననే ఊహాగానాలకి తావిస్తోంది, మహిళా రాష్ట్రపతి, హస్తినకి మహిళా ముఖ్యమంత్రి, ఆంధ్రాలో ఓ మహిళ చేత అత్యంత కీలకమైన గృహమంత్రిత్వ శాఖని అధిరోహింపచేయటం, ఈ విషయాలన్నీ మహిళలకి రాజకీయాల్లో సాధికారత సంపాదించిపెడుతున్నాయని అందరు భావించారు, ఆనందపడ్డారు. ఈ కారణంగానే మన రాష్ట్రానికి ఓ మహిళని ముఖ్యమంత్రిగా చేయాలని అధిష్టానం భావించి ఉండొచ్చు, యూపీయే చైర్ పర్సన్ సోనియా గాంధీ కూడా ఓ మహిళే కావటం మరో ప్రధానాంశం.

మీడియాలో ఎన్ని ఊహాగానాలొస్తున్నా ఏ ఒక్క అభ్యర్ధైనా "లేదు నాకు ఆ పదవి వద్దు" అని ప్రకటించారేమో చూడండి, ఐనా పదవెవరికి చేదు చెప్పండి, అందరూ అధిష్టాన నిర్ణయమే శిరోధార్యమనే మంత్రాన్ని జపిస్తూ లౌక్యంగా తప్పించుకుంటున్నారు నిజమే, ఈ పరిస్థితి లో ఎవరైనా బహిరంగంగా నేను బరిలో ఉన్నాను అని చెప్పే సాహసం చేయగలరా? అసలే సానుబూతి ముసుగులో జగన్ కి పట్టం కట్టేందుకు చాలా ఆందోళనలు చేస్తున్నారు, చేయిస్తున్నారు కాంగ్రెస్ కార్యకర్తలూ, నేతలూ, ఎమెల్యేలు, మరిలా ఉండగా "నాకేగనక సీయం చాన్సు ఇస్తే" అని ఎవరినైనా వ్యాసం రాయమంటే ఎం రాస్తారు చెప్పండి. అనధికార సమాచారం ప్రకారం ఎనభై శాతం అవకాశం జగన్ కేనని గాలి. ఏదేమైనా ఈ నాటకానికి మరో మూడు రోజుల్లో తెరపడనుందని హస్తిన నుండి వర్తమానం, అంతవరకు వేచిచూడాల్సిందే. అంతవరకు ఈ పదవి కుమ్ములాట ఎవరికీ చేటు కాకుండా ఉంటె అంతే చాలు.

(మొదట్లో ఆత్మహత్యలు అనే పదం పక్కన ప్రశ్నార్ధకం పెట్టటానికి గల కారణం, నాకు ఆ విషయం అర్ధంకాకపోవటమే, నిరాహార దీక్షలు చేస్తున్నారంటె సరే, గొడవచేస్తున్నారంటె సరే, ఆత్మహత్య చేసుకుంటానని బెదిరిస్తున్నారన్నా సరే, కానీ నిజంగా ఆత్మహత్య చేసేసుకుంటె ఎం లాభం అంటే అందరూ ఆత్మహత్య చేసుకున్నారనుకోండీ ఇక ఆ ఫలానా వ్యక్తి సీయం అయ్యి ఏం ఉపయోగం?)

భవధీయుడు
దారినపోయే దానయ్య

Saturday, September 5, 2009

పదవి ఆస్తా? బాధ్యతా?

మన దివంగత ముఖ్యమంత్రికి కొందరు నివాళులర్పించే విధానాన్ని చూస్తే ఆవేదన కలుగుతోంది. ఒక ప్రజనాయకుడికి ఇదేనా మనమిచ్చే గౌరవం? ప్రజలకి ఒక గొప్ప బాసటగా నిలిచిన శ్రీ వై.యస్స్.ఆర్ గారిని ఖననం చేస్తున్నప్పుడు రోదనలకంటే, వివిధ మతాలవారు ఆయన ఆత్మశాంతికై చేస్తున్న ప్రార్థనలకంటే పెద్దగా జయజయ నాదాలు వినపడ్డాయి. వై.యస్స్.ఆర్ గారి తనయుడు జగన్ని ముఖ్యమంత్రిగా చూడాలి అని అనుకోవటం సబబే కానీ దానికి ఇదా సందర్భం? ఇదా సమయం? “వై. యస్స్ .ఆర్ అమర్ రహే” కి బదులుగా “కాబోయే సీయం జగన్” అని నినదించిన ఆ కార్యకర్తలకి, నేతలకి, అసలు గతించిన మనిషిపైన ఏమాత్రం గౌరవముందో అర్ధమవుతుంది. తండ్రి పోయిన దుఃఖంలో ఉన్న తనయుడిని ఓదార్చే తీరిదేనా? మనుషులయ్యుండి ఇంత విచక్షణలేకుండా ఎలా ప్రవర్తించగలుగుతున్నారు? స్వర్గస్తులయ్యింది మనం రాజ్యాంగబద్ధంగా ఎంచుకున్న నాయకుడు ఆయన మరణాన్ని ఇంకొకరికి పట్టం కట్టే సంధర్భంగా అభివర్నించటం కడు సోచనీయం.

ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా శ్రీ రోశయ్యగారిని ప్రభుత్వం ప్రకటించింది మరి కొన్ని రోజుల్లో మళ్ళీ అధిష్టానం ముఖ్యమంత్రి పదవి పై ఒక నిర్ణయానికి వస్తుంది, అప్పుడు కదా మన మద్దత్తు ఎవరికన్నది తెలపాల్సింది?

వార్తాపత్రికల్లో జగన్ సీయం కావాలని శిరోముండనం చేసుకున్న అభిమానులు, పిల్లలు అని ఫోటోలు ప్రచురించారు. వారిలో సగానికి పైగా ఉన్నది నాలుగేళ్ళనుండి పదమూడేళ్ళ మధ్యలో ఉన్న పిల్లలే, నిజంగా వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి ఉంటారా? ఆలోచించండి అసలు సీయం అంటే ఏమిటో కూడా సరిగ్గా తెలియని వయసు వారిది ఎవరో కార్యకర్తల ప్రోద్బలంతో జరిగే ఇలాంటి పొలిటికల్ డ్రామాలని అభిమానం అని ఎలా అనుకుంటారో అర్ధంకావట్లేదు. మన రాజ్యాంగంలో ఓటు హక్కు పద్దెనిమిదేళ్ళు పైబడ్డ యువతీయువకులకివ్వటం ఇలాంటి ప్రలోభాలని, బలవంతాలని అడ్డుకోవటానికే కదా.

పూర్వం రాజులహయాంలో సక్షత్రియులు మాత్రమే రాజ్యమేలేవారు (క్షత్రియుడంటే అదో వర్గమో, కులమో కాదు), వారి తదనంతరం రాజ్యాన్ని వారి వారసులకి అందించటం సాంప్రదాయం అది కూడా వారికి సరైన శిక్షణనిచ్చి, పలురకాల పరీక్షలు పెట్టి, బుధ్ధి, తెలివి, రాజనీతి, యుద్ధవిద్యాదులలో ప్రావీణ్యం ఉన్నప్పుడే రాజ్యాధికారాన్ని అప్పజెప్పేవారు, మన ఆస్తిని మన పిల్లలకి పంచివ్వటం సరైనదే కావచ్చు కానీ ఆ క్రమంలోనే, పరాయిదేశస్తులకి కొమ్ముకాచి చివరికి వారికి బానిసలుగా దశాబ్దాలపాటు వెట్టిచాకిరి చేసి దేశాన్నీ, దేశ సంపదలనీ అమూల్యమైన మన జాతి ఔన్నత్యాన్ని, ఆత్మాభిమాన్నాన్ని కోల్పోయాం, మళ్ళీ ఎన్నో రక్తతర్పణలతో స్వతంత్రులుగా అయ్యాం, ఎవరో కొందరు రాజులు భయంవల్లనో, మొహమాటం వల్లనో, పేరాశ వల్లనో, అమాయకత్వం వల్లనో, నిస్సహాయత వల్లనో, లేక పిరికితనం వల్లనో చేసిన పనికి సస్యశ్యామలము, సకలవిద్యా ధామము, సుసంపన్నము ఐన మనజాతి బిడ్డలు తెల్లవరి మోజేతి నీళ్ళు తాగాల్సిన అగత్యం పట్టింది. ఇలాంటిది మళ్ళీ జరగకూడదని ప్రజలనీ, వారి బాగోగులని చూసే బాధ్యతగలిగిన పదవులని సైతం ఆస్తులుగా పరిగణించటం సరికాదనే ఉద్దేశ్యంతో, రాజ్యాలనీ, రాజులనీ కాదని ప్రజలందరిని ఒక నీడకిందకి తీసుకొచ్చి రాజ్యాంగాన్నీ, రాజకీయాన్నీ ప్రవేశపెట్టుకున్నాం. మరి అలాంటప్పుడు ఇంకా ఈ వారసత్వ పరిపాలనలెందుకు? సానుభూతిని ప్రదర్శించటానికి ఇదొక్కటే పద్ధతా?

ప్రభుత్వకార్యాలయాల్లో ఎవరైన చనిపోతే వారి పదవులని వారి వారసులకి అందించే వీలుంది. మంత్ర పదవి కూడా ప్రభుత్వోద్యోగమే కానీ దానిని కూడా మిగతా వాటితో సరికట్టటం ఎంతవరకు న్యాయం? చిన్న ఉద్యోగాలలో అవకతవకలని సరిచేసుకునే వీలు ఉండొచ్చు, వీలుకాని పరిస్తితిలో అయినా ఆ నష్టం తక్కువగానే ఉంటుంది, అదే ఒక బాధ్యతగల మంత్రి పదవిని అనుభవంలేని వారికి ఇస్తే ఎదైనా తప్పు జరిగితే దాని నష్టం ఎంత పెద్దగా ఉంటుందో ఆలోచించాలి. మన దేశ చరిత్రలో ఎందరో వారసులు మంత్రి పదవులు చేపట్టారు, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, సబితా ఇందిరా రెడ్డి, దగ్గుబాటి పురందరేశ్వరి, తదితరులెందరో మనకి ఉదాహరణగా ఉన్నారు, వారంతా సమర్ధవంతంగా వారి పదవులని చేపట్టలేదా అని అడగొచ్చు, ఇదే సరైనదైతే ప్రతి ఐదు సంవత్సరాలకొకసారి ఎన్నికలెందుకు? వారి కుంటుంబాలే ఆ పదవుల్లో స్థిరపడిపోవచ్చు కదా? అప్పుడు ఎన్నికల తంతు ఉండదు ప్రతి ఐదేళ్ళకోసారి మనకి ఓటు హక్కు ఉంది అని మనం గుర్తుచేసుకోనక్కర్లేదు, డబ్బు, మందు, గట్రాలను పంచక్కర్లేదు, ఓటు వినియోగించుకోటానికి గంటలతరబడి క్యూలో నిలబడక్కర్లేదు తొక్కిసలాటలు తన్నులాటలు జరగక్కర్లేదు. కానీ మనం ఎన్నికలని నిర్వహిస్తాం, రాజ్యాంగ బధ్ధంగా నాయకులని ఎన్నుకుంటాం ఎందుకని? నాయకుల పని తీరుని గమనించటానికి, నాయకుల అవకతవకలని ఎత్తుచూపటానికి మనదగ్గరున్న ఓటు అనే ఆయుధాన్ని వాడుకోవటం ఎంతో అవసరం కాబట్టి, ఆ ఆయుధమే లేకుంటే మళ్ళీ బానిసత్వశృంఖలాల్లోకి తల్లి భారతిని ఎప్పుడొ నెట్టేసి మరణశిక్ష విధించగలవారున్నారు, దేశాన్ని వేలానికి అమ్మగలిగేంతా మహానాయకులూ ఉన్నారు.

కుటుంబం గొప్పదని చూసి పిల్లలచేతికి అణ్వాస్త్రాన్ని ఇవ్వలేము కదా, ఏం చేస్తారో చూద్దాంలే అని మన భవిష్యత్తును వారిచేతికిచ్చి చూస్తూ కూర్చోలేం కదా, దేశం ప్రయోగశాల కాదు మనమందరం ప్రయోగశాలలోని వస్తువులము కాదు, సానుభూతితో చేసే ప్రయోగం వికటిస్తే ఇప్పుడిప్పుడే గుర్తింపు పొందుతున్న మన దేశం గుర్తేలేకుండా పోయే ప్రమాదం ఉంది. మన దేశాన్ని మనమే కాపాడుకుందాం మన తలరాతలని మనమే దిద్దుకుందాం. రాజ్యాంగపరంగా, చట్టపరంగా, న్యాయపరంగా జీవిద్దాం, నాయకులను సానుభూతితో కాక స్పూర్థితో ఎన్నుకుందాం దేశాన్ని ప్రగతిపథాన నడిపిద్దాం.

ఇదేదో ఒకరిపైన కోపంతోనో, వ్యతిరేకతతోనో వ్రాసింది కాదు, ఒక భారతీయ పౌరుడిగా దేశం పట్ల ఉన్న మమకారమే నా మనసునిలా స్పందింపజేసిందే తప్ప మరొకటి కాదు.ఒకసారి ఆలోచించండి ఎవరి మనోభావాలనైనా నొప్పిస్తే మన్నించండి.

మరోసారి మన చిరునవ్వుల ముఖ్యమంత్రి, రాజకీయానికి సొగసుతెచ్చిన మొనగాడు, మడమతిరగని ధీరుడు శ్రీ యేడుగూరి సందింటి రాజశేఖర రెడ్డి గారికి నివాళులర్పిస్తూ, వారి ఆత్మకి శాంతి ప్రసాదించాలనీ, వారి కుటుంబానికి మనోస్థైర్యాన్ని, గుండెనిబ్బరాన్ని ప్రసాదించమని ఆ భగవంతున్ని ప్రార్ధిస్తూ..

భవదీయుడు
దారినపోయే దానయ్య



Wednesday, September 2, 2009


Dr. Yeduguri Sandinti Rajasekhara Reddy
8th Jul 1949 - 3rd Sep 2009

It is a great tragedy to have lost our Chief minister in a chopper crash. Lets pray for his soul and pray for strength to handle this situation.