Friday, December 11, 2009

తెలుగునాడు..




"మా తెలుగు తల్లికీ మల్లె పూదండా మా కన్న తల్లికీ మంగళారతులు..."

ఒకప్పుడు ప్రతి పాఠశాలలో వినిపించే ప్రార్థనాగీతం. కానీ ప్రస్తుత పరిస్థితి అగమ్యగోచరం.విద్యాధికులు,ధనికులు,పేదలూ అనే తేడా లేకుండా నగరాన్ని అల్లకల్లోలం చేస్తున్నారు పల్లెల్ని కూడా ఈ రొంపిలోకి లాగటానికి ప్రయత్నిస్తున్నారు.

త్రిలింగభాషగా..మొదలైన మన తేనలూరే తెలుగు భాషను ఇప్పుడు మాండలీకాలనూ, యాసలనూ వేదికగా చేసుకుని చీల్చటానికి కొన్ని శక్తులు శతధాసహశ్రధ ప్రయత్నిస్తున్నాయి..ఈ కాష్టంలో కాలుతున్నది మాత్రం సామాన్యుడు. నేను పుట్టింది, పెరిగి విద్యా బుధ్ధులు నేర్చిందీ తెలంగాణాలోనే..తల్లితండ్రులు జన్మతః కోస్తా తీరవాసులైనా నాకు హైదరాబాదే పుట్టిల్లు. ఏ ప్రాంతమైనా నాది ఆంధ్రప్రదేశ్, మాది తెలుగు భాష అని గర్వంగా చెప్పుకునే వాడిని. గత రెండు వారాలుగా సాగుతున్న రాద్ధాంతం కొత్తదేమీ కాదు ఎన్నో ఏళ్ళుగా ఉన్నదే. కానీ కొత్తగా ఇప్పుడు జరిగిందేమిట్రా అంటే.. కేంద్ర ప్రభుత్వం దీనికి స్పందించి ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు ఊటంకించటం.

శ్రీ కేసీఆర్ గారి పాచిక ఈ సారి బాగా పారిందనే చెప్పాలి. 2001 వరకు తెలుగుదేశంలో ఉండి అందులోనుండి విడిపోయి తెలంగాణా రాష్ట్ర సమితి పేరుతో ప్రత్యేక తెలంగాణా రాష్త్ర సాధనే మానిఫెస్టోగా 2004 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తో చేతులు కలిపారు.అప్పుడు ఆయనకి ఇచ్చిన మంత్రి పదివిని నిర్వర్తించి కొన్నాళ్ళకే రాజీనామా చేశారు, కారణం కేంద్రం తెలంగాణాకి అనుమతి ఇవ్వలేదు అని.ఈయన ఘన చరిత్ర ఏమని చెప్పాలి? ఓ ఏడాది పాటు తన నియోజికవర్గం దరిదాపుల్లోకి కూడా వెళ్ళకపోయేంత బిజీ అయిపోయారు...దానికి ఆయన్ని ఆ ప్రాంతం ప్రజలు నిలదీస్తే అక్కడ్నుండి ఎలాగో తప్పించుకుని బయటపడ్డారు. సొంత లాభాపేక్షతో ఆయన చేస్తున్న ప్రచారాలని ప్రజలు తెలుసుకున్నట్టున్నారు..పాపం గత అసెంబ్లీ ఎన్నికల్లో అతి తక్కువ సీట్లు సంపాదించుకోగలిగారు..అప్పుడు ఆయన తమ ఓటమికి కారణం తెలుగుదేశంతో పొత్తేనని చెప్పుకున్నారు...అవును పాపం ప్రజలకి తెలీదు ఎవరికి ఓటెయ్యాలో. పిచ్చి జనం వారి పొత్తులతో బాధపడ్డారో లేక వారి ఎత్తులతో విసిగిపోయారో, వారిని పులుసులో లేకుండా చేశారు.
ఏదేమైనప్పటికీ ఆ పార్టీ అస్తిత్వానికి సవాలు ఎదురయింది. దానికి తోడు తోడుగా ఉంటారనుకున్న పార్టీసభ్యులందరూ మెల్లగా తలో దారీ చూసుకోవటం గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్టైది. మింగలేకా కక్కలేకా ఎలాగో అలా తన ఉనికిని కాపాడుకొనే ప్రయత్నంలో మరో సారి తెలంగాణ గానం ఎత్తుకున్నారు. ఈ సారి కాస్త నాటకీయంగా తాను నిరాహార దీక్ష చేయబోతున్నాననీ...ఆ చెయ్యబోయే ముందు మరి బుజ్జగింపులకోసమో ఉజ్జాయింపులకోసమో అన్నట్టుగా రాష్ట్ర మరియూ కేంద్ర ప్రభుత్వాన్ని కలిసి మరీ ఆ నిర్ణయం తీసుకున్నారు.

దీక్ష ప్రారంభానికి వెళ్ళె ముందు మీడియాతో "బహుశా ఇదే నేను మీకిస్తున్న ఆఖరి ఇంటర్వ్యూ కావచ్చు" అని ఓ నాటకీయ డైలాగు. ఆ తర్వాత సాగిన ఎత్తులు పైఎత్తులు, పగిలిన అద్దాలు, తగలబడిన బస్సులు,మనుషులూ, విరిగిన లాఠీలు...ఇవన్నీ అందరం చూశాం, ఆవేశపడ్డాం, చలించిపోయాం.

గాంధేయ పద్దతిలో ఆయన దీక్షమొదలుపెట్టారు బానే ఉంది...అత్యుత్సాహానికి పోయి మన పోలీసులు వీరంగం చేశారు. అది చిలికి చిలికి గాలివానయ్యింది. ఎందరో అమాయకులకు గాయాలు,ప్రాణహాని,ఆస్తి నష్టం. కానీ అంతా శాంతియుతంగా జరిగింది అని మీడియాలో వార్తలు. "శాంతియుతం" అనే పదానికి కొత్త సవరణలూ, అర్ధాలు ఉన్నాయేమోమరి వారి నిఘంటువులలో.

ఈ వారం-పదిరొజుల్లో టీవీ ద్వారా చూసిన కొన్ని దృస్యాలు, వాటి తాలూకు స్పందనలు.

ఒకానొక తెరాస నేత ఓ విలేఖరితో చెప్పటం,

నేత: "మేము మా కార్యకర్తలూ శాంతియుతంగా మా నిరసనని తెలియజేస్తున్నాము...ఎవరికి ఎలాంటి నష్టం జరగదు. ఇవాళ బస్సులు కదలకుండా బంద్ నిర్వహిస్తున్నం"
విలేఖరి: మరి ఇలా రవాణాను ఆపితే సామాన్య ప్రజ ఇబ్బంది పడదా?
నేత: లేదండీ ఇక్కడున్న ప్రయాణీకులంతా స్వచ్చందంగా తమ మద్దత్తు తెలపటానికే బస్టాండుకు వచ్చారు..వారేమీ ఇబ్బంది పడటంలేదు
(అప్పటికే దాదాపు అక్కడ 100 మందికి పైగా ప్రయాణీకులు వారి కుటుంబాలతో దిక్కుతోచక బిక్కు బిక్కుమంటూ కూర్చుని, "మమ్మల్ని ఇలా ఇబ్బంది పెట్టటం భావ్యమా" అని విలేఖరులని అడగటం జరిగింది)
ఒకవేళ ఆ ప్రయాణీకులు నిజంగా స్వచ్చందంగా తమ మద్దతు తెలపటానికే ఐతే పాపం వాళ్ళూ సూటుకేసులు, పిల్లల్ని తీసుకుని బస్సు కౌంటరు దగ్గర ఎందుకుంటారో ఆ నేతగారే చెప్పగలరేమో

శాంతియుతంగా నిరసన తెలుపుతున్నాం అని ఆయన చెప్తుండగానే కర్రలు పట్టుకుని "జై తెలంగాణా" అని అరుస్తూ వీధుల మీద పరిగెడుతున్న తెరాస కార్యకర్తలూ విధ్యార్ధులని చూపించారు ఆ ఛానెల్ వారు..శాంతియుతమంటే ఆయుధాలని చేతబూని ప్రజల్ని భయపెట్టటం, ఆ కారల్తో వాళ్ళు బస్సుల అద్దాలను పగల గొట్టటం అని అర్ధమేమో మరి.

న్యాయవాదులూ, విద్యావేత్తలూ, అందరూ అవకాశం దొరికింది కదా అని తమ మద్దతుని తెలిపారు... నాకు అర్ధంకానిదేమిటంటే ఇన్నాళ్ళూ ఏమైంది? ఇప్పుడు కొత్తగా ఓ వ్యక్తి/నేత నిరాహార దీక్షతో ఇంతగా స్పందించినవారు ఇన్నేళ్ళుగా జరుగుతున్న ఆకలి చావులను గమనించలేకపోయారా? ప్రజా శ్రేయస్సుకంటే ఓ నాయకుడే ముఖ్యమా? ఆయనమీద అంత గౌరవమూ నమ్మకమూ ఉండి ఉంటే గత ఎన్నికలలో ఆయన్ని (ఆ పార్టీని) ఎందుకు గెలిపించలేదూ?

మొదటిరోజు ఆసుపత్రిలో ఆయన దీక్ష విరమించినట్టు ఆయన పళ్ళరసం తాగుతున్నట్టు మీడియా చూపించింది..దానికి ఉద్రేకులైపోయిన ప్రజ ఆయన్ని దూషించటం మొదలుపెట్టింది. మరి అది తెలుసుకుని భయపడ్డారో ఏమో వెంటనే విలేఖర్లని సమావేశపెట్టి "తాను దీక్ష కొనసాగిస్తున్నట్టు తెలియజేసారు...అది పళ్ళరసం అని ఆయనకి తెలీదనీ ఇంకేదో అనీ" చాలా చెప్పారు...ఇంకేదో ఐనా ఎందుకు తాగారో మరి ఆయనకే తెలియాలి.శరీరంలోకి ఏదో రూపేణా సత్తువని అందజేస్తూ ఆయన్ని దీక్షలో కొనసాగించినవారికి జేజేలు..

ఇక విద్యార్ధులు ఇతర్త్రా శ్రేణుల జనం చేసిన వీరంగం అంతా ఇంతా కాదు...కనపడిన ప్రతివాడినీ కెలకటం మీడియా వంతైతే...దొరికిన ప్రతి మైకులోనూ పూనకించి మాట్లాడటం వారి వంతూ అయ్యింది.

బస్సులు,విగ్రహాలు,సంస్థా కార్యాలయాలు కావేవీ విధ్వంశానికి అనర్హం అని కనపడిన వాటిలో చాలానే ధ్వంసం చేయటం, వారి చర్యలని నేతలు చాలా గొప్పగా వెనకేసుకురావటం. చూస్తుంటె మతి పోతుంది...మన ఆస్తికి మనమే నష్టం కలిగించుకుంటూ...మన పూర్వీకులనీ మన భాష ఔన్నత్యాన్నీ మనమే పాడుచేసుకోవటం ఏం లక్ష్య సాధన? స్వర్గీయ ఎన్.టీ.ఆర్ (తెలుగు వారందరం ఒకటి మనం ఓ శక్తి అని చాటినవారు), శ్రీ పొట్టి శ్రీరాములు(ఆంధ్ర రాష్ట్ర ఆవిర్భావానికి ప్రాణం అర్పించినవారు) ఇలా ఎందరివో విగ్రహాలని ధ్వసం చేశారు. ఇంకా నయం శ్రీ కృష్ణదేవరాయలూ, అన్నమయ్య మొదలగువారి విగ్రహాలని కూడా ధ్వంసం చేసేస్తారేమొ అని భయపడ్డాను. కారణం వారు తెలంగాణేతర వ్యక్తులు.

నేతలు చెప్పటం ఒక ఎత్తు, జనం నమ్మటం మరో ఎత్తు...నేతల్లో కొందరు "మాకు తెలంగాణా కావాలి ఆంధ్రా మరియూ రాయలసీమ వాసులు మాకు చేస్తున్న అన్యాయాన్ని అరికట్టాలి వారిని ఇక్కడి నుండి తరిమి కొట్టాలి" అని అంటు ప్రసంగాలు ఇచ్చారు. ఎవరినైనా ఎలా వెళ్ళగొట్టగలరు? రాజ్యాంగబధ్ధంగా, చట్టబధ్ధంగా అది ఎలా సాధ్యం? ప్రతి భారతీయునికీ తాను ఉండాలనుకునే చోట ఉండటానికీ పనిచేసుకోటానికీ సర్వహక్కులూ ఉన్నాయి. ఇది అర్ధం చేసుకోలేని వారు నేతలై ప్రసంగాలివ్వటం వారిని ప్రజలు వినటం. చదువుకున్నవారు కూడా ఈ ప్రలోభవాక్యాలను నమ్మటం విస్మయం కలిగిస్తుంది. కొందరు ఆదివాసీ తెగలు, చదువుకోని వారు తెలియక నేతలు చెప్పిన భాష్యాలకి చప్పట్లు కొడుతున్నారు.ఒకవేళ ఆ తెలంగాణా నేతలన్నట్టు తెలంగాణేతర వ్యక్తులు వెళ్ళిపోవాలి ఇక్కడుండకూడదూ అంటె...పరాయి రాష్ట్రాల్లో/దేశాల్లో/ఖండాల్లో ఉన్నావారందరిని తమ తమ ప్రాంతాలకి తరళి రమ్మనండి. అక్కడెక్కడొ కూర్చుని ఎగరటం కాదు ఇక్కడికి వచ్హ్చి మాట్లాడమనండి. ఉద్యమంలోని అర్ధాన్ని కనీసం ఓ పది శాతానికైనా తెలియనివ్వండి...చాలామంది మాండలీకాలని బట్టి ప్రాంత విభజన జరుగుతుంది అనే అపోహలో ఉన్నారు...ఒకవేళ అదే ఐతే మనకి ప్రతి జిల్ల ఓ రాష్ట్రంగా ఏర్పడుతుంది...ఒక్కో జిల్లలో కూడా మరిన్ని యాసలున్నాయి మనకి మరి వాటిని కూడా విభజించాలేమో.మనలో మనం కొట్టుకు చావటం ఆపితే మనల్ని కీలు బొమ్మలు చేసి ఆడుతూ వినోదిస్తున్నా వారిని చూడగలుగుతాం.

నాకు తెలిసినంతవరకు గ్రహించినంతవరకు...తెలంగాణ,రాయలసీమా,కోస్తా సామాన్య ప్రజలకు ఎటువంటి ద్వేషాలూ లేవు స్వార్ధ రాజకీయ నాయకులు ఆడుతున్న చదరంగంలో పావులుగా మారుతున్నారందరూ.

వాహనాలపైన ఏపీ అని కనిపిస్తే అది కొట్టేసి టీజీ అని రాయటం, ఆర్.ఎస్ బ్రదర్స్, ఆంధ్ర బ్యాంకు వంటి వాటి మీద ప్రతాపం చూపించటం దేనికి? ఆర్.ఎస్ బ్రదర్స్లో తెలంగాణా వాసులకు బట్టలు అమ్మం అని చెప్పారా?ఆంధ్రా బాంకులో తెలంగాణా ఖాతాదారులు లేరా? పేరు వల్లే మీకు ఇబ్బంధి ఐతే ఆంధ్రప్రదేశ్ ని తెలుగునాడు అని పిలుచుకుందాం ఏమంటారు?

ఓ వ్యక్తి మైకు దొరకగానె కేసీఆర్ ని ఉద్దేశిస్తూ "అన్నా బతికుంటే బలుసాకు తిని బతకొచ్చు కానీ నువ్వు చావద్దొన్నా నువ్వు దీక్ష విరమించి ఉద్యమం సాగించు" అని అన్నారు..."బతికుంటే బలుసాకు తినటం" అనే వాక్యం నాకెంతో నవ్వు తెప్పించింది.ఆ సంధర్భంలో అది వెటకారంగా వాడినట్టనిపించింది...ఆ వెరితనానికి నవ్వుకున్నాను

ఆ కేసీఆర్ గారు ఆసుపత్రిలొ ఉన్నంతకాలం చాలా సీరియస్ గా ఉన్నారు పరిస్థితి విషమం నేడో రేపో అని గోల పెట్టారు మరి అంత దయనీయ స్థితిలో ఉన్నా ఆయన ఓ గ్లాసుడు నిమ్మరసం తాగగానే..ఎమర్జెన్సీ నుండి మామూలు గదికీ మరునాడు ఇంటికీ ఎలా వెళ్ళగలిగారో ఆ ఈశ్వరుడికే తెలియాలి.


అప్పటిదాకా గోలలని చూసిన అధికార పార్టీ శ్రేణులు, ప్రతిపక్షాలు అందరూ వారి వారి మద్దత్తు తెలిపారు ఉద్యమానికి...ప్రజల్లో వారి ఉనికిని చాటుకోటానికి...వారి ఉనికిని కాపాడుకోటానికి..కానీ ఆ పంధాలో ప్రజల్లో ఎన్నో ఉద్వేగాల్ని రేపారు.

ఎప్పుడైతే ప్రత్యేక తెలంగాణా అని కేంద్రం నిర్ణయాన్ని ప్రకటించగానే అందరూ కేసీఆర్ ని పొగిడారు..ఆ నిర్ణయాన్ని ఎప్పుడైతే తెలంగాణేతర ప్రజలు వ్యతిరేకించారో ఈ "గోపీ" నేతలు(గోడమీద పిల్లులు) అందరూ ప్లేటు ఫిరాయించే దారిలో పడటంలోనే ప్రజలకి అర్ధంకావాలి వారి అవకాసవాదాలు...ఇప్పుడు రాష్ట్రాన్ని ఎన్ని ముక్కలు చేయాలి ఎవరెవరు ఎవరెవరిని పంచుకోవాలి అని మంతనాలు సాగిస్తున్నారు. ఇప్పటికైనా ప్రజలు సమైఖ్యంగా ఉండి ఇలాంటి వాళ్ళకి బుధ్ధి చెప్పాలి..తెలంగాణా వాసులకి ఇతర ప్రాంత వాసుల పట్ల ఎటువంటి ద్వేషాలు లేవని చాటి చెప్పాలి. భగ్గుమంటున్న రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిదీ.

తెలంగాణా మీద కేంద్రం నిర్ణయం తొందరపాటే అనిపిస్తుంది ఇన్నాళ్ళుగా స్పందించనిది ఇవాళ కొన్ని గొడవలూ ఓ నేత నిరాహారదీక్ష(?) కి తలొగ్గటం హాస్యస్పదమే కాదు ఆందోలణకరం కూడా..ఇలా ప్రభుత్వం తలొగ్గి ఏకపక్ష నిర్ణయం తీసుకోవటం ఏంటి? అంధ్రప్రదేశ్ ని విడదీయటం కేవలం తెలంగాణా వాసుల చేతిలో ఎలా ఉంటుంది? ఆంధ్రప్రదేశ్ అనేది అందరిదీ కదా?మరి అలాంటప్పుడు మిగతా వారిని సంప్రదించకుండా రాత్రికి రాత్రి ఎలా నిర్ణయం తీసుకుంటారు? అదే విషయంగా అందరిలోనూ నిరసన వ్యక్తమవుతుంది..ఏదేమైనా ఇప్పుడు రాజకీయపరంగా అందరూ ప్రజలని బాగా మభ్యపెడుతున్నారు.దీనివల్ల ఏమి జరిగినా జరగకున్నా అందరిలో ఓ ఉత్కంఠత, ఓ అర్ధంకాని పరిస్థితి. చదువుకున్న వాళ్ళు, ఉద్యోగం చేస్తున్నవాళ్ళు, వ్యాపారాలు చేస్తున్నవాళ్ళు ఇలా అందరికీ ప్రశ్నార్ధకం. లోకల్/నాన్-లోకల్ ల గోల.India is a Sovereign,democratic,secular,republic country free from religious and regional fanaticism. Lets remain thus and respect each other as public than being in a herd of sheep to follow uneducated political personnel or the so called "Leaders" Lets pray that these people will get into their senses soon and stop tormenting people's sentiments and emotions. lets be wise and not behave as uneducated literates. Lets deal with the crisis together and workout unitedly.



ఇట్లు భవదీయుడు,
దారినపోయే దానయ్య



2 comments:

  1. 100% తెలుగు ప్రజలున్న యానాం ను ఇప్పటికైనా తమిళ పుదుచ్చేరి నుండి విడదీసి సమైక్యాంధ్రలో కలపాలి.

    ReplyDelete
  2. యానాన్ని ఆంధ్రాలో ఎందుకు కలపలేదు?
    see this link for answer

    http://yanamgurimchi.blogspot.com/2008/05/blog-post_2177.html

    ReplyDelete